నీట్‌ రీ-టెస్ట్‌: టెలిగ్రామ్‌పై నిషేధం.. వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు?

  • పేపర్‌ లీక్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న టెలిగ్రామ్‌ ఛానళ్లు
  • రహస్యంగా ఛానళ్లు నిర్వహించే వెసులుబాటు ఉండటమే కారణం
  • భారీ ఫైళ్లు, పీడీఎఫ్‌లు షేర్‌ చేసే సౌకర్యం
  • ప్రభుత్వ ఆదేశాల అమలులో వాట్సాప్‌ కంటే టెలిగ్రామ్‌ సహకారం తక్కువ
నీట్‌ రీ-టెస్ట్‌కు ముందు టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో మరి వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు అనే చర్చ తెరపైకి వచ్చింది. రెండు యాప్‌లూ మెసేజ్‌లు పంపడానికే అయినప్పటికీ.. టెలిగ్రామ్‌ రూపకల్పన, ఫీచర్లు, నిర్వహణ విధానంలో ఉన్న తేడాలే ఈ నిర్ణయానికి కారణంగా కనిపిస్తున్నాయి.

ఎన్‌టీఏ ప్రకారం.. ‘పేపర్‌ లీక్‌డ్‌ నీట్‌’, ‘రీ-నీట్‌ 2026’ వంటి పేర్లతో నడుస్తున్న టెలిగ్రామ్‌ ఛానళ్లు విద్యార్థులను మోసం చేస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. పలుసార్లు ఛానళ్లను తొలగించినా కొత్త పేర్లతో మళ్లీ ప్రత్యక్షమవుతుండటంతో చివరికి యాప్‌పైనే ఆంక్షలు విధించాలని సూచించింది.

టెలిగ్రామ్‌లో ఫోన్‌ నంబర్‌ను దాచి కేవలం యూజర్‌నేమ్‌తోనే అకౌంట్‌ నిర్వహించవచ్చు. అంతేకాకుండా లక్షలాది మంది సభ్యులతో ఛానళ్లు నడిపే అవకాశం ఉంటుంది. దీంతో అసలు నిర్వాహకులను గుర్తించడం కష్టమవుతుంది. భారీ పరిమాణంలో పీడీఎఫ్‌లు, ఇతర ఫైళ్లను సులభంగా షేర్‌ చేయగలగడం కూడా మోసగాళ్లకు అనుకూలంగా మారింది.

మరోవైపు వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎడిట్‌ చేయడానికి టైమ్‌ లిమిట్‌ ఉంటుంది. టెలిగ్రామ్‌లో పాత పోస్టులను కూడా సవరించే అవకాశం ఉంటుంది. ఎన్‌టీఏ ప్రకారం, కొందరు నిర్వాహకులు ఈ ఫీచర్‌ను ఉపయోగించి పాత సందేశాల్లో పీడీఎఫ్‌లు జోడిస్తూ తప్పుడు పేపర్‌ లీక్‌ ఆధారాలను సృష్టిస్తున్నారు.

అలాగే ప్రభుత్వ ఆదేశాల అమలు, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణలో వాట్సాప్‌ మాతృసంస్థ మెటా మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే టెలిగ్రామ్‌పై చర్యలు తీసుకున్నప్పటికీ వాట్సాప్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు విధించలేదని విశ్లేషకులు వివరిస్తున్నారు.

Telegram
NEET Retest
NTA Paper Leak
WhatsApp Ban
Central Government India
Telegram Security Features

More Telugu News